తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్ ప్రారంభం, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక ప్రకటనలు.
హైదరాబాద్, భారతదేశం 16, జులై 2026 ALN: తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో భార త్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలన్న సంకల్పానికి అమెజాన్ నెలకొల్పుతున్న డేటా సెంటర్ తొలి మెట్టుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. అమెజాన్ రాకతో పెట్టుబడులకు కొత్త ఊపు లభిస్తుందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీకి వచ్చే పెట్టుబడులు పరిశ్రమలకు మంచి ప్రోత్సాహకరంగా ఉపయోగపడతాయని, ఫ్యూచర్ సిటీలో అధునాతనమైన నగరాన్ని నిర్మించాలని, ఫార్చ్యూన్-500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి 2025 డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించామని ఈ సమ్మిట్లో 108 దేశాల నుంచి మూడు వేల మంది వివిధ దిగ్గజ కంపెనీల కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొన్నారని సిఎం తెలిపారు.
తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ‘తెలంగాణ రైజింగ్ -2047’ లక్ష్యమని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంగా 30 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా భారత్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా జాతీయ జీడిపిలో తెలంగాణ తన వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఫ్యూచర్సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు సిఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సిఎస్ సంజయ్జాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుబడులు, ఉద్యోగ కల్పన కీలకంగా మారనుందన్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల కల్పనకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు, అనుమతులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2034 నాటికి అమెజాన్ సంస్థ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని, ప్రతి నెలా పరిశ్రమల స్థాపనకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు.
అమెజాన్ సంస్థ పెట్టుబడులకు సంబంధించి ప్రతి నెలా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని, రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలన్న ఆలోచనతో తెలంగాణ రైజింగ్ పాలసీ విధానాన్ని రూపొందించుకున్నామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. పరిశ్రమలు, పర్యాటకం, ఎనర్జీ, ఆరోగ్యం, స్పోర్ట్ లాంటి రంగాల్లో నిర్దిష్టమైన పాలసీలు రూపొందించుకున్నామని ఉద్యోగ కల్పన కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ను ఏర్పాటు చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
అమెజాన్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఆ ప్రాంతాల్లో ఇతర కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుకు దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఔటర్ రింగ్రోడ్డు, ఐటీ, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ ఎయిర్పోర్టుతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
నగరంలో ఉన్న పరిశ్రమలను బయటకు తరలించే అవసరం ఉందని, మూసీనది ప్రక్షాళన, మెట్రో రైలును విస్తరించాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మూడు లక్షల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులు గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. నగరంలో డీజిల్ మీద ఆధార పడి నడుస్తున్న 2 లక్షల ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్కు ట్యాక్స్ను పూర్తిగా మినహాయించి హైదరాబాద్ను కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఏడాదికి రూ 1,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, దేశంలో ఇతర నగరాల్లో ఉన్న కాలుష్య సంబంధిత సమస్యలను హైదరాబాద్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించామని, సమగ్ర ప్రణాళికతో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ ప్రాంత రైతులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. రీజనల్ రింగ్రోడ్డు, రేడియల్ రోడ్ల కోసం భూములను త్యాగం చేసిన రైతులను ప్రభుత్వం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందన్నారు. భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చి సహకరించిన వారిని సిఎం రేవంత్రెడ్డి అభినందించారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ అవసరమైన నష్ట పరిహారాన్ని అందించాలని అధికారులకు సిఎం రేవంత్రెడ్డి ఆదేశాలిచ్చారు. భూమి ఇచ్చి అభివృద్ధికి సహకరించిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆందోళనలు చేపడుతున్న రైతులతో చర్చించాలని మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మా రెడ్డిలకు సిఎం రేవంత్రెడ్డి సూచించారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించాలని, నష్ట పరిహారాన్ని అందించాలని అమెజాన్ సంస్థ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని సిఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
To learn more about the latest developments in Local & Regional, stay updated with our exclusive reports and analyses on AiLensNews.